
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు. ‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం.
ఒకరిపై ఇంకొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాసరే అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నాం.
ఈ కష్టమైన దశను వీళ్లిద్దరూ దాటగలరని భావిస్తున్నా’ అని లాయర్ వందనా షా ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రెహమాన్ కుమారుడు అమీన్ సైతం ఇన్స్టా గ్రామ్లో ఒక పోస్ట్పెట్టారు. రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం.
