
రోజర్ డేవిడ్ మృతదేహం వద్ద కుటుంబీకుల రోదన
ఎయిరిండియా ప్రమాద ఘటనలో 24 మృతదేహాలు బంధువులకు అప్పగింత..
అహ్మదాబాద్: ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆదివారానికి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ సహా 47 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. 24 మృతదేహాలను సంబందీకులకు అప్పగించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేశారు. ఎయిరిండియా డ్రీమ్లైనర్ గురువారం కుప్పకూలిన ఘటనలో రుపానీ సహా 242 మంది ప్రయాణికులు మృత్యువాతపడగా ఒకే ఒక్క వ్యక్తి సజీవంగా బయటపడటం తెల్సిందే. విమానం పడిన ప్రాంతంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 33 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు.
గుర్తు పట్టలేనంతంగా మాడి మసవ్వడంతో అధికారులు సంబందీకుల నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. 230 మంది ప్రయాణికుల చిరునామాలు సేకరించారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ముగ్గురి సంబం«దీకులు మాత్రం ఇప్పటి వరకు డీఎన్ఏ నమూనాలను ఇవ్వలేదని చెప్పారు. మిగతా వారి విషయంలో సంబందీకులకు డెత్ సర్టీఫికెట్లను సైతం అందజేస్తున్నామన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనా క్రమాన్ని అధికారులు ఆయనకు వివరించారు.

క్షతగాత్రులను పీకే మిశ్రా పరామర్శించారు. విమాన ప్రమాదానికి కారణాలపై ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రధానంగా దర్యాప్తు జరుపుతోంది. ఆదివారం ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన విదేశీ బృందానికి అహ్మదాబాద్ ఫైర్ బ్రిగేడ్ అధికారులు వివరాలను అందించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ఢిల్లీలో మొదటిసారిగా సమావేశం కానుంది. మూడు నెలల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది.