కుప్పకూలిన హెలికాప్టర్‌ | 7 Dead in Uttarakhand Helicopter Crash | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన హెలికాప్టర్‌

Jun 16 2025 3:52 AM | Updated on Jun 16 2025 12:23 PM

7 Dead in Uttarakhand Helicopter Crash

రెండేళ్ల పాప సహా ఏడుగురు దుర్మరణం 

కేదార్‌నాథ్‌ నుంచి తిరిగి వస్తుండగా దుర్ఘటన

ఆర్యన్‌ ఏవియేషన్‌ కార్యకలాపాలపై నిషేధం 

సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన సర్కార్‌

రుద్రప్రయాగ్‌/న్యూఢిల్లీ: భక్తిశ్రద్ధలతో చార్‌ధామ్‌ యాత్ర చేస్తున్న యాత్రికులను ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున హిమ సానువుల్లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించుకుని తిరిగొస్తున్న భక్తులు హెలికాప్టర్‌ కూలి ప్రాణాలు కోల్పోయారు. గౌరీకుండ్‌ అడవుల్లో ఈ దారుణం జరిగింది. రుద్రప్రయాగ్‌ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి నందన్‌ సింగ్‌ రజ్వార్‌ వివరాలను వెల్లడించారు. ఆర్యన్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన బెల్‌ 407 హెలికాప్టర్‌ ఉదయం 5.19 గంటలకు కేదార్‌నాథ్‌ నుంచి గుప్తకాశీ బయల్దేరింది.

కాసేపటికే కేదార్‌ఘాటీలో గౌరీకుండ్, త్రిజుగ్‌ నారాయణ్‌ ప్రాంతాల మధ్య అడవిలో కుప్పకూలింది. అందులోని ఏడుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహారాష్ట్రకు చెందిన జంట, వారి రెండేళ్ల పాప, పైలట్‌తో పాటు బద్రీనాథ్‌–కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ సభ్యుడు విక్రమ్‌ సింగ్‌ రావత్‌ కూడా ఉన్నారు. పైలట్‌ రాజ్‌వీర్‌ సింగ్‌ చౌహాన్‌ ఆర్మీలో 15 ఏళ్లపాటు పైలట్‌గా చేశారు.

కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్లు అటూ ఇటూ ఎత్తైన పర్వతాల మధ్య లోయ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణం, మేఘావృతమైన పొగమంచు గుండా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ప్రమాదానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలవారు.

నెలన్నరలో ఐదో ప్రమాదం
ఏప్రిల్‌ 30న చార్‌ధామ్‌ యాత్ర మొదలైనప్పటి నుంచి హెలికాప్టర్లు కూలిపోవడం ఐదోసారి. ఈ నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రలో హెలికాప్టర్‌ సేవలను రెండు రోజులు నిలిపేస్తున్నట్టు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్యన్‌ ఏవియేషన్‌ సంస్థ హెలికాప్టర్‌ కార్యకలాపాలను తక్షణం నిలిపివేస్తూ డీజీసీఏ ఆదేశాలిచ్చింది. కేదార్‌నాథ్‌ లోయలో రాకపోకలు సాగించే అన్ని హెలికాప్టర్ల నాణ్యత, సామర్థ్యాలను తక్షణం సమీక్షించేందుకు అధికారులను పంపుతోంది.

దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు చేయనుంది. ‘‘ఇలాంటి ఘటనల్లో జవాబుదారీతనం పెంచాలి. దర్యాప్తు, భద్రతా ప్రమాణాల అంశంలో కేంద్ర, రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’ అని కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement