ఈ ఏడాదిలో అత్యధిక కేసులు

24882 Fresh COVID-19 Cases In India - Sakshi

ఒకే రోజులో 24,882 మందికి కోవిడ్‌

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 24,882 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 15,602 కేసులు, కేరళలో 1,780, పంజాబ్‌లో 1408, కర్ణాటకలో 833, మధ్యప్రదేశ్‌లో 603 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 140 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,58,446కు చేరుకుందని తెలిపింది.

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,09,73,260కు చేరుకుంది. మొత్తం రికవరీ రేటు 96.82 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,02,022గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.74  శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.40గా ఉంది. ఇప్పటివరకూ 22,58,39,273 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం 8,40,635 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top