జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్ల మృతి | 2 Soldiers Killed, 2 Terrorists Dead In Separate JK Encounters | Sakshi
Sakshi News home page

మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతి

Sep 13 2024 9:21 PM | Updated on Sep 14 2024 12:46 PM

2 Soldiers Killed, 2 Terrorists Dead In Separate JK Encounters

శ్రీనగర్‌:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్‌లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.

కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్‌ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సెర్చింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి

ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్‌కౌంటర్‌లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.

అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.

ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్,  రాంబన్ జిల్లాల్లో  ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్‌ జరగనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement