నారాయణపేట: జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికలకు సమయ ప్రణాళిక విడుదలైంది. కలెక్టర్, జిల్లా రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుల ఆదేశాల మేర కు జిల్లా సహకార అధికారి ప్రసాదరావును ఎన్నికల అధికారిగా నియమించారు. సమయ ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 9న అర్హులైన ఓటర్ల జాబితాను ప్రచురించారు. జాబితాపై అభ్యంతరాలు, ఆక్షేపణలను అర్హులైన సభ్యు లు 14వ తేదీలోపు ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి కార్యాలయంలో స్వయంగా లిఖితపూర్వకంగా సమర్పించాలి. 15వ తేదీన అందిన అభ్యంతరాలు, ఆక్షేపణలను పరిశీలించి ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులపై అప్పీళ్లను సమీక్షిస్తారు. అనంతరం తుది నిర్ణయం కోసం సెప్టెంబర్ 16న రాష్ట్రశాఖకు జాబితాను పంపించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సెప్టెంబర్ 19న తుది ఓట రు జాబితాను ప్రచురించడంతో పాటు అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్, జీఏ విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2008 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మెమో, ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 99853 75737 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 16న (బాలురు), 17న (బాలికలు) జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మనాయక్ కో రారు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ము గించుకుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. చివరకు ఉపాధిహామీ పథకంలో తల్లిదండ్రులతో కాలిసి పనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు భీమ్లా, నాయకులు మెగావత్ దీప్లానాయక్, చందర్నాయక్, ముడావత్ మణికంఠ, కుమార్, పవన్, మోహన్, ఈశ్వర్, చందర్ పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కల్వకుర్తి రూరల్: భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. గురువారం పట్టణంలోని తిలక్నగర్కాలనీలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భవనంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 27 లక్షల మంది నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు నిధులను పాలక ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. హెల్త్ టెస్ట్ల పేరుతో రూ.450 కోట్లు, ట్రెయినింగ్ సెంటర్ పేరుతో మరో రూ.300 కోట్లు, కార్మికుల పిల్లలకు ఐటీ ఉద్యోగాల పేరుతో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. 60 ఏళ్లు నిండిన భవన కార్మికులకు రూ.9 వేల పింఛన్ ఇవ్వాలని, వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 25న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


