హొళగుంద: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువన ఉన్న తుంగా ప్రాజెక్ట్ నుంచి 35 వేల క్యూసెక్కులను వదులుతుండగా ఆ నీరు టీబీ డ్యాం వైపు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు 1,00,750 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. తాగునీటి అవసరాలకు కాలువలకు 1,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం ఎగువ భాగంలోని ఆగుంబే, శృంగేరి, తీర్థనహళ్లీ, వరనాడు, శివమొగ్గ, చిక్ మంగళూర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 1,633 అడుగుల డ్యాం మట్టానికి గాను బుధవారానికి 1,624 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 68 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
నీటి డ్రమ్ములో పడి
బాలుడి మృతి
సి.బెళగల్: ఆడుకుంటున్న బాలుడు నీటి డ్రమ్ములో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపింది. సి.బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బోయ గంపరాజు గోవిందు, సుజాత దంపతులకు ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు వివేక్ ఉన్నాడు. బుధవారం అదే గ్రామంలోని బంధువులు వారిని భోజనానికి ఆహ్వానించడంతో కుమారుడితో వెళ్లారు. అయితే అక్కడ బాలుడు వివేక్ను ఇంటి ఆవరణలోని కట్ట (అరుగు)పై ఆటాడుకునేందుకు వదిలారు. కుటుంబ సభ్యుల చిన్న ఏమరపాటులో కొన్ని నిమిషాల్లోనే వివేక్ కనిపించకపోవడంతో వారు ఇంటి పరసరాల్లో వెతికారు. కాగా బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో కట్ట దగ్గరున్న నీటి డ్రమ్ములో కుటుంబ సభ్యులు చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పంటల పరిశీలనకు
ఎల్నినో కాంబాట్ టీమ్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను శాస్త్రవేత్తల బృందాలు పరిశీలిస్తున్నాయి. కర్నూలు ఏరువాక కేంద్రం, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు ఎల్నినో కాంబాట్ శాస్త్రవేత్తలు బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలిస్తూ.. రైతులకు త గిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కర్నూలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం కోడుమూరు, గూడూరు, కల్లూరు మండలాల్లో పర్యటించింది. ప్రస్తుతం పంటల పరిస్థితి ఎలా ఉంది.. పంటలు కోలుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి... ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో వేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఏరువాక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ తెలిపారు. వారి వెంట కల్లూరు ఏవో విష్ణువర్థన్రెడ్డి, అసిస్టెంటు ప్రొఫెసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.


