శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో వీడియో చిత్రీకరణ ఘటన మరువక ముందే శ్రీశైల ఆలయంలో యథేచ్ఛగా వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో అప్లోడ్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో ముఖ్య భద్రతాధికారి, సుమారు 200 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద భక్తులు ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, నిషేధిత పదార్థాలు, బ్యాగులు తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహిస్తారు. అయితే తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడంతో యథేచ్ఛగా అందరూ ఆలయంలోకి మొబైళ్ల తీసుకెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి తన ఇన్స్ట్రాగ్రామ్ ఆలయంలో చేసిన వీడియోను రెండు రోజుల క్రితం అప్లోడ్ చేయడంతో మరోసారి మల్లన్న క్షేత్రంలో భద్రతా వైఫల్యం బయటపడింది. అలాగే శ్రీశైల ఆలయంలోనే తీసిన మరొక వీడియోను వారం క్రితం ఆమె పోస్టు చేసినట్లు వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ రీల్ స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీశైల ఆలయం మొత్తం కలియ తిరుగుతూ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అసలే క్షేత్రంపై ఉగ్రవాదుల నిఘా ఉందని పలుమార్లు అక్టోపస్ బృందం పరిశీలించి క్షేత్రంలో భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చినా బేఖాతర్ చేస్తున్నారు. ఉగాది ఉత్సవాల్లో సైతం ఓ వ్యక్తి ఏకంగా గర్భగుడిలోకి మొబైల్ తీసుకెళ్లి గర్భగుడి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. దేవస్థాన ఉన్నతాధికారి పర్యవేక్షణాలోపం వలనే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మల్లికార్జున స్వామి ఆలయంలో
యథేచ్ఛగా వీడియో చిత్రీకరణ
గత రెండు రోజల క్రితం ఇన్స్ట్రాగ్రామ్లో
రీల్స్ అప్లోడ్ చేసిన యువతి
ప్రత్యేక అధికారి, సిబ్బంది తనిఖీలు చేస్తున్నా..
మొబైళ్లతో భక్తుల ఆలయ ప్రవేశం


