● కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన
నంద్యాల(అర్బన్): జిల్లాలో మిగులు జొన్నలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట గడివేముల మండలం బిలకలగూడూరు, పెసరవాయి గ్రామాల రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జొన్నల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయంటూ సివిల్సప్లయ్ అధికారులు, అనుమతులు రాలేదంటూ కలెక్టర్ కార్యాలయ అధికారులు చెబుతుండటంతో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. జొన్నలు కొనుగోలు చేయకపోతే ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ.. జిల్లాలో 54వేల ఎకరాల్లో జొన్నపంట సాగు అయి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యాయన్నారు. ప్రభుత్వం కేవలం 30వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి టార్గెట్ అయిపోయిందని చెప్పడం అన్యాయమన్నారు. రాష్ట్రం తన వాటాగా జొన్నలు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం పీజీఆర్ఎస్లో ఉన్న కలెక్టర్కు సమస్యను వివరించగా.. కేంద్ర ప్రభు త్వం నుంచి జొన్నల కొనుగోళ్లకు అనుమతులు వచ్చినట్లు మెసేజ్ వచ్చిందని కలెక్టర్ రాజకుమారి తెలిపారని రైతులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడి మంగళ, బుధవారాల్లో కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.


