
బెలుం గుహలకు వేసవి ఎఫెక్ట్
కొలిమిగుండ్ల: భూగర్భంలో అవతరించి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే బెలుం గుహలపై వేసవి ప్రభావం పడింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులా వచ్చినా ఫలితం లేకుండా పోయింది. గుహల అందాలను తిలకించేందుకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి యాత్రికులు వచ్చేవారు. 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో భయపడుతున్నారు. పైగా గుహల్లో ఉక్కపోత అధికంగా ఉండటంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.15వేలకు పైగా, శని, ఆదివారాల్లో రూ.30 వేల మేర ఆదాయం వస్తుండేది. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా చాలా వరకు యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆదాయం పడిపోయింది. గుహలోపలి భాగాలతో పాటు ఆవరణలోని ప్రదేశాలు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి.
గుహ లోపలికి చేరుకునే దారిలో కనిపించని ప్రజలు
ఎండల తీవ్రతతో గుహలు చూసేందుకు ఆసక్తి చూపని పర్యాటకులు