నూతన భవనం నిర్మించాలి..
మాడుగులపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ యునాని వైద్యశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఎప్పుడు కూలిపోతుందోనని అక్కడ వైద్యసేవలు పొందుతున్న రోగులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిత్యం బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో గడుపుతున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని తొలగించి కొత్త భవ నం నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పైకప్పునకు కర్రలే ఆసరా..
మాడుగులపల్లిలోని ప్రభుత్వ యునాని వైద్యశాలలో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. సంబంధిత వైద్య విధానంలో ఆమోదం పొందిన మందులను రోగులకు అందిస్తున్నారు. అయితే, వైద్యం అందించాల్సిన భవనం పరిస్థితే అత్యంత దయనీయంగా మారింది. ఐదు దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా మిద్దె గదులతో ఈ భవనాన్ని నిర్మించారు. కాలక్రమేణా సరైన నిర్వహణ లేకపోవడంతో గోడలు, పైకప్పు బలహీనంగా మారాయి. ప్రస్తుతం భవనం పైకప్పు, గోడల నుంచి ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపడుతున్నాయి. పైకప్పు కూలకుండా అడుగడుగునా కర్రలతో ఆసరా ఇచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు విద్యుత్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
వర్షమొస్తే నరకయాతనే..
వర్షం వచ్చిన సమయంలో భవనం లోపలికి నీరు చేరుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే ప్రజలు సైతం భవ నం పరిస్థితిని చూసి భయాందోళనకు గురవుతున్నా రు. మరోవైపు రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే.. ముందుగా సురక్షితమైన భవనం, అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి రాకముందే అధికారులు స్పందించి శిథిల భవనాన్ని వెంటనే ఖాళీ చేయించి, ప్రత్యామ్నాయంగా సురక్షితమైన భవనంలోకి ఆస్పత్రిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
భయాందోళనలో రోగులు, వైద్య సిబ్బంది
ఫ కర్రల సాయంతో నిలబడ్డ పైకప్పు
ఫ మాడుగులపల్లిలో శిథిలావస్థకు చేరుకున్న భవనం


