నల్లగొండ : జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలను వారానికి రెండుసార్లు సందర్శించి నివేదికలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు సమర్పించాలని ఆదేశించారు. హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. మునుగోడు ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున బోర్లు మరమ్మతులు చేసి ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావ పాల్గొన్నారు.
ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణే లక్ష్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో స్పెషల్ సీఎస్, రవాణా రోడ్డు భవనాల శాఖ వికాస్రాజ్ హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని సూచించారు. జాతీయ రహదారుల వెంట పోలీస్, రవాణాశాఖ అధికారులు నిత్యం పెట్రోలింగ్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్ల వివరాలు మ్యాపింగ్ చేసి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ, జిల్లా రవాణా అధికారి శ్రీవాణి పాల్గొన్నారు.
సర్ ప్రక్రియలో వేగం పెంచాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వారంలోగా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ 90 శాతానికి చేరుకోవాలన్నారు. సర్ ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ నంబరు నమోదు చేయడం కేవలం ఐచ్చిక మాత్రమే అని, తప్పనిసరి కాదన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


