కట్టంగూర్, నిడమనూరు : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( ఈఈ) వాణిశ్రీ అధికారులను ఆదేశించారు. కట్టంగూర్, నిడమనూరు మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్కుమార్తో కలిసి పరిశీలించారు. ముందుగా కట్టంగూర్లోని గాంధీనగర్ కాలనీ నివాసితుల ఇంటి స్థలాలు, గుడిసెలను పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన అర్హత ప్రమాణాల మేరకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిడమనూరు మండలం జంగాలవారిగూడెంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న 30 ఇళ్లను పరిశీలించారు. రెండో విడత ఇళ్ల మంజూరులో గుడిసెల్లో ఉంటున్న వారికే ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అనంతరం ఆయా చోట్ల ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 11వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. 3వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వ నిర్దేశించిన 750 గజాల్లోపు ఇంటి నిర్మాణం చసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు అంజన్రెడ్డి, ఎస్డీ.ఇమామ్ ఏఈలు బానోతు అరుణ, మేఘన, సర్పంచ్లు ముక్కాముల శ్యామలశేఖర్, రూపాని పుష్పలతకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఈఈ వాణిశ్రీ


