వైటీడీ పాలక మండలి చేత ఆలయ ఈఓ భవాని శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా చైర్మన్ డాక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి ఉదయం 11.37గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత సభ్యులు వరుసగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ ప్రమాణం చేశారు. అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఈఓ భవాని శంకర్, ప్రధానార్చకుడు కె.వెంకటాచార్యులు ప్రమాణం చేశారు.
పాలక మండలి సభ్యుల్లో వినోద్ వెంకటస్వామి, స్వాతి కంఠమణి ఇంగ్లిష్లో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సత్యనారాయరెడ్డితో పాటు ఆరుగురు సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులు తెలుగులో ‘దైవ సాక్షిగా’ అని ప్రమాణ స్వీకారం చేశారు.
యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తామని వైటీడీ చైర్మన్ డాక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆధ్మాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) పాలకమండలి శనివారం కొండపైన గర్భాలయంలోని బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీ పాలక మండలి తొలి సమావేశం నిర్వహించారు. సమావేశం వివరాలను చైర్మన్ సత్యనారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. పాలక మండలి మొదటి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించామని టీటీడీ తరహాలో వైటీడీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొండపైన భక్తులకు సౌకర్యాలు లేక ఉదయం వచ్చి, సాయంత్రం వెళ్తున్నారని, అలా కాకుండా భక్తులు కొండపైన బస చేసేలా చర్యలు చేపడతామన్నారు. కొండపైన విష్ణు పుష్కరిణి అంశంపై ఈఓ భవాని శంకర్ తమ దృష్టికి తీసుకువచ్చారని, విష్ణు పుష్కరిణి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై దృష్టి పెడతామన్నారు. శ్రీస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తిరిగి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేదుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, రాత్రి సమయంలోనూ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఫ విష్ణు పుష్కరిణి అందుబాటులోకి తెస్తాం
ఫ వైటీడీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి వెల్లడి
ఫ కొలువుదీరిన కొత్త పాలకవర్గం


