నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో నీటి దందా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సొంత బ్రాండ్ల పేర్లతో స్టిక్కర్లు అంటించి వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారు. పట్టణంలోని ప్రముఖ హోటల్స్లో సొంత లోగోలు, క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్లతో కూడిన స్టిక్కర్లు వాటర్ బాటిళ్లపై దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో లభించే బ్రాండెడ్ వాటర్ కంపెనీల ధరలకు ఏమాత్రం తగ్గకుండా, (లీటర్ రూ.25) ఈ సొంత స్టిక్కర్ల బాటిళ్లను కస్టమర్లకు విక్రయిస్తున్నారు. కానీ ఈ బాటిల్లో నీటి నాణ్యతపై మాత్రం ఎటువంటి గ్యారెంటీ ఉండడం లేదు.
నాణ్యతపై కస్టమర్లలో అనుమానాలు..
హోటళ్లలో విక్రయిస్తున్న వాటర్ బాటిళ్లలోని నీరు నిజంగానే శుద్ధి చేసినదేనా? ఎఫ్ఎస్ఎస్ఏఐ వంటి ప్రభుత్వ సంస్థల అనుమతులు వీటికి ఉన్నాయా? అనే సందేహాలు కస్టమర్లలో వ్యక్తమవుతున్నాయి. కేవలం తమ హోటల్ బ్రాండింగ్ కోసం సాధారణ నీటిని బాటిళ్లలో నింపి, ఆకర్షణీయమైన స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో సాగుతున్న ఈ వాటర్ బాటిళ్ల విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని, నీటి నాణ్యతను పరీక్షించి వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఫ హోటళ్లు, రెస్టారెంట్లలో సొంత స్టిక్కర్లతో వాటర్ బాటిళ్లు
ఫ బ్రాండెడ్ రేట్లకు తగ్గకుండా అమ్మకాలు
ఫ నీటి నాణ్యతపై వినియోగదారుల ఆందోళన
హోటళ్లు, రెస్టారెంట్లలో ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు లేని వాటర్ బాటిళ్లను విక్రయించడం పూర్తిగా చట్టవిరుద్ధం. కేవలం సొంత స్టిక్కర్లు అంటించుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నీటిని విక్రయిస్తే వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. త్వరలో తనిఖీలు నిర్వహించి నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతాం. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను మోసం చేస్తున్నట్లు తేలితే సదరు హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎన్.శివశంకర్రెడ్డి,
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నల్లగొండ


