నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్ను ఆమోదించారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో యూనివర్సిటీలో క్రీడల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాల కల్పన, అంతర్ విశ్వ విద్యాలయ క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనభరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కె.హరీష్కుమార్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ రాజేష్కుమార్, వసంత, మిర్యా ల రమేష్కుమార్, కె.అరుణప్రియ, సీహెచ్.సుధాకర్రెడ్డి, రవినాయక్ పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
హాలియా : ప్రభుత్వ హాస్టళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ సుశీందర్రావు అన్నారు. శుక్రవారం ఆయన హాలియా పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు, బాలికల హాస్టళ్లతో పాటు కేజీబీవీని సందర్శించారు. ఆయా హాస్టళ్ల పరిసరాలు, పరిశుభ్రత, ఆహార నాణ్యత, మంచినీటి వసతి, సివిల్ వర్క్స్, మెనూ వివరాలు, భోజనశాలు, వంట సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులకు ఎలాంటి లోటురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రామచందయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హైమావతి, పలు హాస్టళ్ల వార్డెన్లు తదితరులు ఉన్నారు.
మేరా యువ భారత్ కమిటీ ఏర్పాటు
నల్లగొండ టూటౌన్ : మేరా యువ భారత్ జిల్లా సమన్వయ కమిటీని నియమించినట్లు జిల్లా యువజన క్రీడల జిల్లా అధికారి అక్బర్ అలీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా సమన్వయ కమిటీ యాక్షన్ ప్లాన్ 2026–27 సంవత్సరానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై భారత్ రిజిస్ట్రేషన్ డ్రైవ్లో క్యూఆర్ కోడ్ ద్వారా జిల్లాలోని యువత అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా యూత్ అధికారి గౌతమ్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, భానుచందర్, ఇంటర్మీడియట్ అధికారి దస్రూనాయక్, ప్రిన్సిపాల్స్ ఘనశ్యాం, పద్మ, ఉపేందర్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, కరుణాకర్, యూత్ వలంటీర్లు పాల్గొన్నారు.
యాప్తో యూరియా బుకింగ్ సులభం
నకిరేకల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రక్రియ సులభంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి వినోధ్కుమార్ తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని పలు పర్టిలైజర్ల దుకాణాల్లో శుక్రవారం ఆయన ఆకస్మికం తనిఖీల చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ స్మార్ట్ పోన్ ద్వారా ఇంటి నుంచే సులభంగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆయన వెంట ఏఓ మహ్మద్ జానీమియా, డీలర్లు కోటగిరి రమేష్, మురారిశెట్టి క్రిష్ణమూర్తి, దయాకర్ ఉన్నారు.


