నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరాభివృద్ధిపై నజర్ పెట్టిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నగరానికి నిధుల వరద పారిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, నగరంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఎస్ఎల్బీసీ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.550 కోట్లు మంజూరు చేయించారు.
శివారు ప్రాంతాలకు మహర్దశ
నగర శివారు ప్రాంతాల్లోని కాలనీలతోపాటు విలీన గ్రామాల్లో 15 ఏళ్లు అవుతున్నా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగానే నిధులు విడుదలవుతున్నాయి. రూ.250 కోట్లతో 180 కిలోమీటర్ల మేర యూజీడీ నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా 208 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరుగనుండడంతో రోడ్ల సమస్య తీరనుంది. కాగా 2008లో రూ.56 కోట్లతో 208 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, రూ.35 కోట్లతో 180 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. తాజాగా మరోసారి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్లకు రూ 300కోట్లు మంజూరు చేయించారు.
ఎస్ఎల్బీసీ నుంచి దుప్పలపల్లి వరకు బైపాస్
నల్లగొండ నగర పరిధిలోని ఎస్ఎల్బీసీ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.250 కోట్లు మంజూరు చేశారు. నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ద్వారా నీలగిరి నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. హ్యామ్ రోడ్ల కింద ఎస్ఎల్బీసీ నుంచి దుప్పలపల్లి వరకు 150 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా మిర్యాలగూడ వైపు నుంచి వాహనాలు నగరంలోకి రాకుండానే నాగార్జునసాగర్, దేవరకొండ ప్రాంతాల వైపు చేరుకోవచ్చు. ఇప్పటికే పానగల్ ఛాయా సోమేశ్వరాలయం నుంచి మర్రిగూడ, కతాల్గూడ మీదుగా ఎస్ఎల్బీసీ వరకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనులన్నీ పూర్తయితే నీలగిరి నగరం చుట్టూ నాలుగు వరుసల రోడ్డు అందుబాటులోకి రానుంది. భారీ వాహనాలు, ఇతర వాహనాలు సైతం నగరంలోకి రాకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా చేయవచ్చు.
ఫ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణం
ఫ ఎస్ఎల్బీసీ నుంచి దుప్పలపల్లి వరకు బైపాస్ రోడ్డు


