కొల్లాపూర్: పట్టణంలోని శివాలయం నుంచి ఈదమ్మగుడికి వెళ్లే బాట పంచాయితీ ఉద్రిక్తతకు దారితీసింది. నెల రోజులుగా ఈ బాట విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం రేగుతోంది. గతంలో ఉన్న బాటను ఆక్రమించి ఓ వర్గం శ్మశాన వాటిక కోసం కంచె ఏర్పాటు చేస్తున్నారని మరోవర్గం సంఘాలు, రైతు నాయకులు ఆరోపిస్తుండగా.. సర్వే నక్ష ప్రకారమే తాము హద్దులు ఏర్పాటు చేసుకున్నామని మరోవర్గం నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు తన అనుచరులతో కలిసి రహదారిని పరిశీలించారు. మరోవర్గం ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను తొలగించి, 50 ఫీట్ల వెడల్పుతో రహదారి కోసం సిమెంట్ స్తంభాలు నాటారు. కొల్లాపూర్లో అందరూ సోదరభావంతో మెలుగుతున్నారని.. ఉద్దేశపూర్వకంగా ఓ కౌన్సిలర్ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని త్వరలోనే ఇరవర్గాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. మధ్యాహ్న సమయంలో సీఐ శంకర్నాయక్ పోలీసు, మున్సిపల్ సిబ్బందితో రహదారి కోసం నాటిన సిమెంట్ స్తంభాలు తొలగించేందుకు వచ్చారనే సమాచారంతో బీజేపీ నాయకులు మళ్లీ అక్కడికి వచ్చారు. తాము నాటిన సిమెంట్ కడ్డీలు తొలగిస్తే.. ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.


