జిల్లాలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లు
● కొత్తగా 39 నిర్మాణాలు
● ప్రారంభోత్సవానికి 3 సిద్ధం
● ప్రస్తుతం అందుబాటులో
107 సబ్స్టేషన్లు
కల్వకుర్తి: జిల్లాలో గృహ, వ్యవసాయ, చిన్న, పెద్ద పరిశ్రమల నిర్వహణలో భాగంగా రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయా రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి సబ్స్టేషన్ల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ట్రాన్స్కో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 107 ఉన్నాయి. వీటికి అదనంగా మరో 39 సబ్స్టేషన్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవేగాక 132/33, 220/132 సబ్స్టేషన్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటోంది.
రూ.130 కోట్లతో నిర్మాణాలు..
జిల్లాలో రూ.130 కోట్లతో కొత్తగా 39 సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణానికి రూ. 3కోట్ల నుంచి రూ. 3.50కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో మూడు మాత్రం 10 ఏళ్ల కిందట మంజూరైనా నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. వెల్దండ మండలంలోని పోతేపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంచాలకట్ట, పెంట్లవెల్లి గ్రామాల్లో మంజూరైన సబ్స్టేషన్లు నిర్మాణం ప్రారంభించగా.. వివిధ కారణాలతో నిర్లక్ష్యం చూపారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయిస్తున్నారు. నెల రోజుల్లో పనలు పూర్తి చేసి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవే కాక జిల్లాలోని వివిధ మండలాల్లో 36 సబ్స్టేషన్లు మంజూరు కాగా.. కొన్ని టెండర్ దశలో, మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
మరికల్ వద్ద చేపట్టిన 220/132 విద్యుత్ సబ్స్టేషన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇది ప్రారంభమైతే జిల్లాలోని లట్టుపల్లి, మంగనూరుతో పాటు వనపర్తి, జడ్చర్ల ప్రాంతాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సమస్య తీరుతుంది. ప్రస్తుతం లట్టుపల్లి, మంగనూరు ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యతో సతమతమవుతున్నారు. మరో 220/33 సబ్స్టేషన్ను అమ్రాబాద్కు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.
వంగూరు మండలం పోల్కంపల్లి వద్ద 132/33 సబ్స్టేషన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. విద్యుత్ సబ్స్టేషన్తో వెల్దండ, చారకొండ మండలాలతో పాటు రెండు రెవెన్యూ డివిజన్లో విద్యుత్ సమస్య చాలా వరకు తీర్చవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పోతేపల్లిలో నిర్మిస్తున్న 33/11 కేవీ
విద్యుత్ సబ్స్టేషన్


