కందనూలు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై ఈ నెల 20న జిల్లా ఇన్చార్జి మంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేకాధికారులు, ఉన్నతాధికారులతో వీసీ నిర్వహించి.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, 20న నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష సమావేశాల నిర్వహణను సమగ్రంగా వివరించారు. వర్షాభావ పరిస్థితులు, తాగునీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, వ్యవసాయ, ఉద్యాన పంటల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు అవకాశాలు, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ సరఫరా, పశువులకు మేత, తాగునీటి ఏర్పాట్లు, నీటి సంరక్షణ చర్యలు, ఇతర శాఖల వారీగా చేపట్టిన చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించి.. అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన తాజా గణాంకాలు, క్షేత్రస్థాయి సమాచారం, చేపట్టిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అరుణారెడ్డి పాల్గొన్నారు.


