కందనూలు: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిస్సింగ్ కేసుల దర్యాప్తును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి.. అదృశ్యమైన వారి ఆచూకీ త్వరితగతిన గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావులేకుండా గడువులోగా దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గ్రేవ్, నాన్– గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్ డేటాను తప్పనిసరిగా నవీకరించాలని, మ్యానువల్ రికార్డులు, సీసీటీఏఎస్ నమోదు మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ఫేక్ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు సాయి వెంకట్రెడ్డి, శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.
యూనిఫాంలు సకాలంలో అందించాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు నాణ్యతతో కుట్టి.. సమయానికి అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి యూనిఫాంల కుట్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, కుట్టు విధానం, ఫినిషింగ్, బటన్లు, కాలర్లు, సైజులు తదితర అంశాల్లో ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కుట్టు పనులు పూర్తిచేసి.. వచ్చేనెల 15లోగా విద్యార్థులకు అందించాలని చెప్పారు.
ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో వివిద కళాశాలల్లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ, ఇంట్రిగేటెడ్ బీఈడీ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. బ్యాక్లాగ్ బీ ఫార్మసీ సెమిస్టర్–1లో 44.59, సెమిస్టర్–3లో 61.62, సెమిస్టర్–5లో 51.67, సెమిస్టర్–7లో 68.50, రెగ్యులర్ సెమిస్టర్–8లో 90.66 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఎం ఫార్మసీలో బ్యాక్లాగ్ సెమిస్టర్–1లో 66.67, సెమిస్టర్–3లో 75.00, రెగ్యులర్ 4వ సెమిస్టర్లో 94 శాతం ఉత్తీర్ణను నమోదు చేశారు. ఫార్మ్డీలో సెమిస్టర్–3లో 68, సెమిస్టర్–4లో 89 శాతం, 5వ సెమిస్టర్లో 86.67, 6వ సెమిస్టర్లో 95 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఇంటిగ్రేటెడ్ బీఏడ్లో 7వ సెమిస్టర్లో 84శాతం ఉత్తీర్ణతను సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు.


