అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో శనివారం హైకోర్టు జడ్జి శరత్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయం వద్ద ఆయన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో గణపతి పూజ, కుంకుమార్చన, స్వామివారి అభిషేక కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో జడ్జి కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శనేశ్వరుడికి అభిషేకాలు
కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేకాలు జరిపించినట్లు అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. పూజారి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తి మేరకు పూజించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
సింహవాహనంపై
వెంకన్న ఊరేగింపు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరుశాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం శివాలయంలో సుప్రభాతసేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, అర్చనలు, వేదపారాయణం, సుబ్రహ్మణ్య నవగ్రహ మూలమంత్ర అనుష్టానాలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతికి చెందిన కళాకారులచే భరతనృత్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సింహవాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు.
వనపర్తి: సాయుధ దళాల్లో యువశక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పేరుతో సైనిక నియామక పథకం రూపొందించింది. ఈ విభాగంలో చేరిన వారిలో 75 శాతం మంది సైనికులను నాలుగేళ్లకు ఇంటికి పంపిస్తారు. అందుకు తగిన ఆర్థిక భరోసా కల్పిస్తూ.. మిగతా 25 శాతం మంది సైనికులకు అర్హత పరీక్షల ఆధారంగా పదోన్నతలు కల్పించి దేశ రక్షణకు ఉపయోగించుకుంటారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సైనికులు మొదట్లో వేర్వేరుగా.. కొద్దిరోజుల నుంచి కలిసి యువతకు శిక్షణ ఇస్తూ అగ్నివీరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశరక్షణ వ్యవస్థలో అత్యంత ఆధునికతతో నిర్వహించే అగ్నివీర్ (అగ్నిపథ్)లోకి పంపించేందుకు ఫిజికల్, రాత పరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తూ.. యువతను ప్రోత్సహిస్తుండటం.. అందుకు దేశభక్తి గల యువకులు ఆసక్తి చూపిస్తుండటంతో అనుకున్న మేరకు ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే 2025– 26లో జారీ చేసిన నోటిఫికేషన్లో జిల్లాకు చెందిన మాజీ సైనికులు పి.మహేష్, గబ్బర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన 16 మందితో పాటు పెద్దమందడి ముందరితండాకు చెందిన మరో యువకుడు ఎంపికయ్యారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చే వీరు ఒక్కొక్కరు వందమంది యువకులను దేశ రక్షణ కోసం తయారు చేసేలా ప్రస్తుత మాజీ సైనికులు శిక్షణ ఇస్తూ చైతన్యం చేస్తున్నారు.


