కల్వకుర్తి టౌన్: విద్యార్థులు డిగ్రీతోనే తమ ప్రయాణం ముగిసిందని భావించకుండా.. నిరంతరం కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మహబూబ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతోపాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో అవసరమన్నారు. కళాశాలలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆశయాలను నెరవేర్చేలా కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు సామాజిక విలువలను అలవర్చుకోవాలని, ఉన్నత స్థానాలకు చేరుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో పనిచేసే యువతకు భవిష్యత్లో ఎన్నో అవకాశాలు ఉంటాయని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని డీఎస్పీ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. అనంతరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


