కందనూలు: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రగతి పోర్టల్లో జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం వివరాలను నిర్దేశిత విధానంలో నమోదు చేసి ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో విద్యాశాఖపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద జిల్లాలో కొనసాగుతున్న పాఠశాల భవనాల నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ వసతులు, ప్రహరీలు, మరమ్మతు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. చేపట్టిన ప్రతి పనిని నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం పూర్తి చేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రగతి పోర్టల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి పంపే సమాచారం కచ్చితంగా, పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ఆహార నిల్వ విధానం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని డీఈఓ రమేష్కుమార్ను ఆదేశించారు. సమావేశంలో విద్యా శాఖ అధికారులు వెంకటయ్య, నూరుద్దీన్, వెంకటేశ్వరశెట్టి తదితరులు పాల్గొన్నారు.


