కందనూలు: సుస్థిరమైన భవిష్యత్ కోసం కుటుంబ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బాలుర జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, పునరుత్పత్తి, మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, యువత సాధికారతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల వలన సహజ వనరులపై ఒత్తిడి పెరిగి.. ఆహారం, నీరు, నివాస స్థలాలు, విద్య, వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, నిరుద్యోగం, పేదరికం పెరగడంతోపాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అధునాతన శాశ్వత, తాత్కాలిక కుటుంబం నియంత్రణ పద్ధతులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దంపతులు ప్రతి బిడ్డకు కనీసం మూడేళ్ల గ్యాప్ తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హెచ్పీవీ తప్పనిసరి
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా తప్పనిసరి వాడాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీ బాలికల గురుకులంలో విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14–15 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో రక్షణ ఇస్తుందని, వీటితో పలు రకాల ఆరోగ్య రుగ్మతలు దూరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో డీఐఓ సురేష్బాబు, రాజగోపాలాచారి పాల్గొన్నారు.


