కందనూలు/ లింగాల: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తామంతా కట్టుబడి ఉన్నామని ఎంపీ మల్లురవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, లింగాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసిందని, వీటికి తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6.800 కోట్ల వడ్డీ కడుతుందని పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా నిరూపిస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తమ సవాల్ను స్వీకరించే దమ్ము లేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, అది చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం మానుకోవాలని, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మిషన్ భగీరథ, పెండింగ్ ప్రాజెక్ట్ల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చేయలేని అభివృద్ధిని తెలంగాణలో చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు.


