కల్వకుర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలనలో కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ. 1400 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి నల్లగొండలో ప్రారంభించిన హ్యామ్ పథకంలో భాగంగా కల్వకుర్తికి పలు రోడ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. 160 కి.మీ. మేర 28 రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 100 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. జూలై 4న సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వస్తున్నారని.. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ఎంపీ డా.మల్లు రవి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర 2న కల్వకుర్తికి చేరుకుంటుందని.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే సభకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మధు, ఆనంద్ కుమార్, జిల్లెల్ల రాములు, కౌన్సిలర్లు రామరాజు, ఎజాస్, మక్బూల్, రాహుల్, భూపతిరెడ్డి ఉన్నారు.


