చే‘నేత’ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

చే‘నేత’ ఎన్నిక

Jun 29 2026 12:59 AM | Updated on Jun 29 2026 12:59 AM

అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్‌ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్‌ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు.

2013లో చివరిసారి..

రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్‌ చట్టం సెక్షన్‌ 51 కింద అధికారులను పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.

రెండురకాల బ్యాలెట్‌ పత్రాలు..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్‌, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్‌ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్‌ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్‌ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

జిల్లా సంఘాలు ఓటర్లు

జోగుళాబ గద్వాల 16 4,116

నారాయణపేట 12 739

వనపర్తి 8 2,014

నాగర్‌కర్నూల్‌ 3 96

మహబూబ్‌నగర్‌ 1 146

జూలై 10న నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు

నేడు వెలువడనున్న ప్రకటన

పూర్తయిన ఓటరు జాబితా

50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు

ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement