● రాష్ట్ర మంత్రి సీతక్క
● బీజేపీ తీరును ఖండిస్తూ
జిల్లా కేంద్రంలో ర్యాలీ
ములుగు: అణగారిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని, ఉత్తరాఖండ్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని శుద్ధి చేసిన బీజేపీ తీరుకు నిరసనగా ములుగులో శుక్రవారం రాత్రి మంత్రి సీతక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ ది మనువాద భావజాలం, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ భావజాలం పని చేస్తుందని ఆరోపించారు. ఇది మల్లికార్జున ఖర్గేకు జరిగిన అన్యాయం కాదని, దేశంలో 90 శాతం మంది అణగారిన వర్గాలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. 2002 వరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేయలేదని, అలాంటి వారు ఇప్పుడు జాతీయవాద క్లాసులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీ తక్షణమే మల్లికార్జున ఖర్గేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోతు రవిచందర్, నాయకులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, చింతనిప్పుల భిక్షపతి, పల్లె జయపాల్రెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


