చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్‌

VJ Chitra Suicide: Chennai Police Arrest Her Husband - Sakshi

ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త హేమనాథ్‌ అరెస్ట్‌

సాక్షి, చెన్నై: బుల్లి తెర నటి చిత్ర మరణం కేసు ఓ కొలిక్కివచ్చింది. చచ్చిపో అంటూ ఆమెను భర్త హేమనాథ్‌ ప్రేరేపించినట్టు విచారణలో వెలుగుచూసింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాండియన్‌ స్టోర్స్‌ ముల్‌లై పాత్రధారిణి బుల్లి తెర నటి చిత్ర గతవారం చెన్నైలోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె మరణం వెనుక మిస్టరీ ఉందన్న ఆరోపణలతో నషరత్‌పేట పోలీసులు కేసును తీవ్రంగానే పరిగణించాల్సి వచ్చింది. ఆమెతో పాటు హోటల్‌లో ఉన్న రిజిస్టర్‌ మ్యారేజ్‌ భర్త, ప్రియుడు హేమనాథ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరు రోజులుగా ఆయన వద్ద విచారించారు. తొలుత పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో కేసును పలు కోణాల్లో విచారించారు. అనేక మంది వద్ద విచారణ సాగింది. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చిత్ర ఆత్మహత్యకు హేమనాథ్‌ ప్రేరేపించినట్టు తేలింది. ఆ మేరకు వివరాలు..   చదవండి: (చిత్రను హేమనాథ్‌ కొట్టి చంపేశాడు..)

అనుమానంతో.. 
లాక్‌డౌన్‌ కాలంలో ప్రేమలోపడ్డ చిత్ర, రియల్‌ వ్యాపారి హేమనాథ్‌ జంట, ఆంక్షల సడలింపుతో ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. తిరువాన్మీయూరులో ఓ ఇళ్లు నిర్మాణం, చెన్నై శివార్లలోని ఓ కల్యాణ వేదికలో హంగామా వివాహం కోసం షూటింగ్‌ బిజీలో ఉన్న చిత్రపై ప్రేమతో పాటు అనుమానం కూడా హేమనాథ్‌ పెంచుకున్నాడు. చివరకు హేమనాథ్‌ ఒత్తిడితో ఆమె రిజిస్టర్‌ మ్యారేజ్‌కు అంగీకరించక తప్పలేదు. ఆంక్షల సడలింపుతో రేయింబవళ్లు షూటింగ్‌ బిజీలో చిత్ర ఉండడంతో అనుమానం పెరిగింది. ఇది ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది.

సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి షూటింగ్‌ స్పాట్‌కు వచ్చి ఆమెను వెంట పెట్టుకు వెళ్లే సమయంలో కారులో గొడవపడ్డాడు. హోటల్‌కు వెళ్లిన తర్వా కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో చచ్చిపో అంటూ గట్టిగా అరిచి గది నుంచి హేమనాథ్‌ బయటకు వచ్చేశాడు. దీంతో మనస్తాపం చెందిన చిత్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు విచారణలో తేలింది. అయితే, ఆమె ఆత్మహత్య ›ప్రేరణకు హేమనాథ్‌ కారణం కావడంతో ఆయన్ను సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మంగళవారం పూందమల్లి కోర్టులో హాజరు పరిచినానంతరం పొన్నేరి జైలుకు తరలించారు.  చదవండి: (ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య)

ఆర్డీవో విచారణ.... 
చిత్ర మరణం కేసు విచారణకు శ్రీపెరంబదూరు ఆర్డీఓ దివ్యశ్రీ శ్రీకారం చుట్టారు. ఆమె తల్లి విజయ, తండ్రి కామరాజ్, సోదరి సరస్వతి, సోదరుడు శరవణన్‌లను విచారించారు.హేమనాథ్‌ తండ్రి రవిచంద్రన్, తల్లి వసంతల వద్ద కూడా మంగళవారం విచారణ సాగింది. హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేసిన దృష్ట్యా, ఆయన్ను విచారించాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top