విశాల్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘మకుటం’. దివంగత నిర్మాత ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలోని 99వ చిత్రం ఇది. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ‘మకుటం’ సినిమా జూలైలో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలోని ‘నచ్చాకే వచ్చారా..’ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
‘నచ్చాకే వచ్చారా... వెచ్చంగా హత్తుకో గుండెల్లో పెట్టుకో..., నా చేయి పట్టుకో...’ అంటూ ‘నచ్చారే...’ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ స్వరకల్పనలో భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ పాటను ప్రభ పాడారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా చూసిన తర్వాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ‘మకుటం’ చిత్రంతో నా ఆకాంక్ష నెరవేరింది. ఆర్బీ చౌదరిగారిని మిస్ అవుతున్నాను.
ఆ నిర్మాణ సంస్థ నుంచి దర్శకుడిగా నేను 45వ వ్యక్తిని. సుబ్రహ్మణ్యంగారు నాపై పెట్టుకున్న నమ్మకంతోనే ‘మకుటం’ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. ‘పందెం కోడి’ మూవీని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు. ‘మకుటం’ చిత్రంతో ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేశాను’’ అన్నారు అంజలి. ‘‘వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్నకి (ఆర్బీ చౌదరి) ఎంతో స్పెషల్. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ, సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు జిత్తన్ రమేష్.


