
గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమా సమీక్షలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. సినిమాలు, వెబ్సిరీస్ ల జయాపజయాలను నిర్ణయించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పటిలా కొత్త చిత్రం అంటే చాలు నేరుగా సినిమాకి వెళ్లిపోయే పరిస్థితి గానీ ఆ అవసరం గానీ ఇప్పుడు లేదు. సినిమా ఎలా ఉందో తెలియకుండా వెళ్లి తమ డబ్బులు మాత్రమే కాదు సమయాన్ని కూడా వృధా చేసుకోవడానికి ఇష్టపడని ప్రేక్షకులు పెరిగిపోతుండడం వల్ల ఈ సినిమా సమీక్షలు బాగా ప్రాధాన్యత పెంచుకున్నాయి.
మరోవైపు సోషల్ మీడియా విజృంభణతో ఎవరు పడితే వారు సమీక్షకుల అవతారం ఎత్తుతుండడం కూడా సినిమా రూపకర్తల్ని గందరగోళానికి గురి చేస్తోంది. గత కొంత కాలంగా సమీక్షలపై మన టాలీవుడ్తో పాటు అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖుల విమర్శలు చేస్తుండడం తెలిసిందే. అయితే ఇప్పుడు అది మరింత ముందడుగు వేసి బ్లాక్మెయిల్ ఆరోపణల వరకూ వచ్చింది. వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మళయాళ చిత్ర పరిశ్రమే దీనికి కూడా నాంది పలకడం విశేషం.
ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన మలయాళ చిత్రం ‘వ్యసన సమేతం బంధు మిత్రాదికల్’ చుట్టూ ప్రస్తుతం ఈ వివాదం అలుముకుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విపిన్ దాస్ ఒక యూట్యూబ్ రివ్యూయర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.విపిన్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం, సినీఫైల్ అనే యూట్యూబ్ చానెల్ నిర్వహకుడు బిజిత్ విజయన్ తన సినిమా గురించి పాజిటివ్ రివ్యూ రాయాలంటే తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అయితే దర్శకుడు అందుకు అంగీకరించకపోవడంతో, ఆ యూట్యూబర్ సినిమాపై నెగటివ్ రివ్యూ ఇచ్చి, నిర్మాతలు టెక్నీషియన్లను బెదిరించినట్టు విపిన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలు అధికారిక మాధ్యమాల దగ్గర ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అంతేకాదు కేరళలోని పాలరివట్టం పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. అలాగే, సినిమా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ క్రియేషన్స్ భగవంత్ కేసరి, మజిలీ వంటి సినిమాలు సమర్పించిన సంస్థ ఇది హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నది కావడంతో అక్కడ కూడా వేరొక ఫిర్యాదు దాఖలయిందని సమాచారం.
ఈ బ్లాక్ మెయిల్ ఇదే మొదటిది కాదని, ఇదే తరహాలో పలువురు రివ్యూయర్లు సినిమా విడుదలకి ముందే డబ్బు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే నెగటివ్ ప్రచారం చేస్తున్నారని విపిన్ దాస్ ఆరోపించారు. ‘‘పాజిటివ్ కామెంట్లను బ్లాక్ చేసి, నెగటివ్ కామెంట్లను ప్రోత్సహించడం ఒక వ్యవస్థాపిత కుట్ర,’’ అని ఆయన అంటున్నారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్ కోసం మధ్యవర్తుల అవసరం లేదని, నకిలీ ప్రచారాలకు తాను లొంగబోనని ఆయన స్పష్టం చేశారు.

ఇందుకు తోడు, సినిమాలపై అసత్య ప్రచారాలు, భిన్న అభిప్రాయాల మీద వ్యక్తిగత దూషణలు వలన నటీనటులు, యూనిట్ సభ్యులు తీవ్రంగా డీమోరలైజ్ అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై ఫెఫ్కా ( ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ)కు కూడా ఆయన ఫిర్యాదు చేశారట.
‘‘ ఎవరైనా సరే మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నంత మాత్రాన ప్రొఫెషనల్ పరిధుల్లో ఉన్నవారిని తిట్టే హక్కు వారికి ఉండదని’’ విపిన్ దాస్ అన్నారు. డిజిటల్ కంటెంట్ కల్చర్ లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన హితవు అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రంలో అనశ్వర రాజన్, బైజు సంతోష్, అజీజ్ నెడుమంగడ్, సిజు సన్నీ, జోమన్ జ్యోతిర్, నోబి మల్లికా సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషించారు. రచన, దర్శకత్వం విపిన్ దాస్ అందించారు.