పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్లో ఫుల్ బిజీ అయిపోయాడు దర్శకుడు హరీశ్ శంకర్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనపై వచ్చిన ఓ క్రేజీ రూమర్పై స్పందించారు.
పవన్ కాదు.. డూప్
గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఏపీలో ఎన్నికల కంటే ముందే ఈ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. ఎన్నికల తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఒకనొక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలోనే ప్రీలుక్ పోస్టర్ని వదిలారు. అందులో పవన్ కల్యాణ్ ఖాకీ డ్రెస్లో కుర్చీలో కూర్చొని ఉంటాడు. అయితే హీరో ముఖం కనిపించకుండా వెనక నుంచి ఫోటో తీసి పోస్టర్ వదిలారు. ఆ సమయంలో అందులో ఉన్నది పవన్ కల్యాణ్ కాదంటూ రూమర్స్ వచ్చాయి. హరీశ్ శంకరే పవన్కు డూప్గా నటించారనే వార్తలు వైరల్ అయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు ప్రేక్షకులు ఆయనే డూప్గా నటించారని అన్నారు.
బాధ కాదు.. హ్యాపీగా ఫీలయ్యా..
ఈ రూమర్స్పై తాజాగా హరీశ్ శంకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాను పవన్కు డూప్గా నటించలేదని స్పష్టం చేశాడు. ప్రీలుక్ రిలీజ్ సమయంలో వచ్చిన రూమర్స్ చూసి బాధ పడలేదని, పవన్తో తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అలాగే బాడీ డూప్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం అస్తవ్యస్తమవుతాయని, దాని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని, అందుకే డూప్ని వాడతారని చెప్పారు. ఉస్తాద్ విషయానికొస్తే..హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.


