
సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ త్రిష మంచి మనసుతో పాటు తనలోని భక్తిని చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే రోబో ఏనుగును ఆమె బహూకరించారు. చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా (పీఎఫ్సీఐ) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్రిష పనిచేస్తున్న విషయం తెలిసిందే. వారి భాగస్వామ్యంతోనే ఆమె ఈ ఏనుగును అందించారు. సంప్రదాయ మంగళవాద్యాల మధ్య 'గజ' అనే ఏనుగును అందజేసినట్లు పీఎఫ్సీఐ నిర్వాహకులు అధికారికంగా తెలిపారు.
ఆలయంలో నిర్వహించే వేడుకల్లో గజరాజులూ భాగస్వాములవుతుంటాయి. ప్రాణమున్న మూగజీవులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చాలామందిలో ఒక వాదన ఉంది. కొన్ని సందర్భాల్లో వాటికి అసౌకర్యం కలిగినప్పుడు గందరగోళమూ సృష్టిస్తుంటాయి కూడా.. అప్పుడు భక్తులు ప్రమాదంలో కూడా చిక్కుకుంటారు. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకే ఇలా రోబో ఎనుగులు వచ్చేశాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో ఇలాంటి ఎనుగులు కనిపిస్తున్నాయి.
తాజాగా త్రిష అందించిన ఏనుగు 11 అడుగుల పొడవుతోపాటు 800 కేజీల బరువుతో ఉన్నట్లు సంస్థ నిర్వాహుకులు తెలిపారు. ఈ రోబో ఏనుగును తయారు చేసేందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చయిందట. ఈ రోబో ఏనుగు అయిదుగురిని మోయగలదనీ, స్విచ్ సాయంతో దాని తొండాన్ని పైకి, కిందకు కదిలించవచ్చనీ చెబుతున్నారు. దేవుడి ఊరేగింపు సమయంలో కూడా ఈ ఏనుగును ఉపయోగించుకోవచ్చు. కేరళ రాష్ట్రం త్రిశూర్లోని శ్రీకృష్ణ దేవాలయంలో మొదటిసారి రోబో ఏనుగులను పరిచయం చేశారు. హీరోయిన్ ప్రియమణి విరాళంగా రెండు ఏనుగులను అందించారు. నిజమైన ఏనుగులకు ఎలాంటి హాని కలగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మెకానికల్ ఏనుగులు వచ్చేశాయని ఆలయ పూజారులు చెబుతున్నారు.