
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 2014లో ఈ చిత్రానికి బీజం పడితే.. పదేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఇప్పటికే చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. టీజర్, ట్రైలర్ మొదలు.. ప్రతి ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పది ఆసక్తికర విషయాలు మీకోసం..

1) ఈ సినిమాను తొలుత సీనియర్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తీయాలని భావించాడు. తక్కువ బడ్జెట్లో రా అండ్ రస్టిక్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట. కానీ ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరకు వెళ్లాక.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని భావించారట.

2) 2014లో భరణి దగ్గర విష్ణు ఈ సినిమా కథ హక్కులను తీసుకున్నాడు. కొంతమంది దిగ్గజ రచయితలతో కలిసి స్క్రిప్ట్ని డెవలప్ చేసుకున్నారు. లొకేషన్స్ కోసం 2018లో విష్ణు పోలాండ్కి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రం రూపొందించారు.

3) ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2023 సెప్టెంబర్లో ప్రారంభం అయింది. ఎక్కువ భాగం న్యూజిలాండ్లోనే చిత్రీకరించారు. 2023 నవంబర్లో ఈ సినిమా టైటిల్ని అధికారికంగా ప్రకటించారు.

4) ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేం ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

5) 2024 మహాశివరాత్రి సందర్భంగా మంచు విష్ణు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. అలాగే మోహన్ బాబు బర్త్డే సందర్బంగా 2024 మార్చి 19న కన్నప్ప కామిక్ బుక్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.

6) గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫెస్ట్వల్లో ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 14న ట్రైలర్ని విడుదల చేశారు.

7) మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించారు. కన్నప్పగా విష్ణు, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు, చిన్నప్పటి తిన్నడుగా విష్ణు కొడుకు అవ్రామ్ నటించారు. అలాగే విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో నటించడంతో పాటు ‘శ్రీకాళహస్తి గాథ’ పాటను ఆలరించారు.

8) ఇటీవల కాలంలో ఎక్కువమంది స్టార్స్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప అనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.

9) ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తూ 12 కట్స్ చెప్పిందట. దీంతో 195 నిమిషాల నిడివితో రూపొందిన చిత్రం.. చివరకు 182 (3:02 గంటలు)నిడివితో విడుదల కాబోతుంది.

10) ఈ సినిమాకు దాదాపు రూ.200-250 కోట్ల వరకు ఖర్చు చేశారట. ప్రభాస్, మోహన్లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారని విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.