Upcoming Tollywood And Bollywood Movies Shooting At Foreign Countries, Deets Inside - Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో ఫారిన్‌ షూటింగ్‌ అంటున్న స్టార్‌ హీరోలు

Apr 15 2023 1:08 AM | Updated on Apr 15 2023 9:20 AM

Tollywood and Bollywood movie shooting at Foreign Countries - Sakshi

సమ్మర్‌లో కూల్‌గా ఉండే లొకేషన్స్‌ని ఎంచుకుని, వెకేషన్‌కి వెళుతుంటారు కొందరు స్టార్స్‌. కొందరిని షూటింగే చల్లని ప్రాంతాలకు తీసుకెళుతుంది. అలా ‘కేరాఫ్‌ ఫారిన్‌’ అంటూ షూటింగ్స్‌కి, వెకేషన్‌కి విదేశాలు వెళ్లిన స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

► రెండు వారాలుగా ఫారిన్‌లోనే ఉంటున్నారు ఇండియన్‌. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తైవాన్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతోంది. కమల్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్నారు శంకర్‌. ఈ వారం కూడా ‘ఇండియన్‌ 2’ టీమ్‌ సౌతాఫ్రికాలోనే ఉంటుందని తెలిసింది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు.  

► ఇటలీలో ఫైట్స్‌ చేశారు ప్రభాస్‌. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగ ‘సలార్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ గత నెలలో ఇటలీ లొకేషన్స్‌లో జరిగింది. ముఖ్యంగా ప్రభాస్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘సలార్‌’ సినిమా యూనిట్‌ మరోసారి ఫారిన్‌ వెళ్లనుందని సమాచారం. బుడాపెస్ట్‌ లొకేషన్స్‌లో ‘సలార్‌’ షూటింగ్‌ను ప్లాన్‌ చేశారు. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ‘సలార్‌’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రాజా డీలక్స్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రీకరణలో ప్రభాస్‌ పాల్గొంటున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి కాగానే ‘సలార్‌’ కోసం ప్రభాస్‌ ఫారిన్‌ ఫ్లైట్‌ ఎక్కుతారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.  

► లండన్‌లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు శర్వానంద్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఇంకా కొనసాగుతోంది. గత వారం శర్వానంద్, కృతీపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించారు.

► బాలీవుడ్‌ ‘బడే మియా చోటే మియా’ లండన్‌కు షిఫ్ట్‌ అయ్యారు. అక్షయ్‌ కుమార్, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలోరూపొందుతున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. ఇటీవల ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను స్కాట్లాండ్‌లో చిత్రీకరించారు. అట్నుంచి అటు లండన్‌ వెళ్లారు. మరో పది రోజులపాటు లండన్‌ షెడ్యూల్‌ జరుగుతుందట. అలాగే మరో బాలీవుడ్‌ మూవీ ‘యానిమల్‌’ షూటింగ్‌ కూడా లండన్‌లో జరిగింది. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఫారిన్‌ లొకేషన్స్‌లో షూటింగ్స్‌ను ప్లాన్‌ చేశాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement