నెక్ట్స్ట్ టార్గెట్ ఫారిన్ ట్రిప్
ట్యాక్సులు/సెస్సులు/సర్చార్జీ వడ్డింపుపై దృష్టి
తాత్కాలికంగా ఏడాది పాటు అమలు చేసే అవకాశం
డాలర్లను కాపాడుకునే ప్రయత్నమే
అంతర్జాతీయ పరిణామాలతో వేగంగా కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలను (డాలర్లు) కాపాడుకోవడం కోసం ‘బంగారం కొనడాన్ని తగ్గించుకోండి. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ ప్రయాణాలను తగ్గించుకోండి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకు అనుగుణంగానే ఇందులో మొదటి రెండింటినీ కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పసిడి కొనుగోళ్లకు కాస్త అడ్డుకట్ట వేసేందుకు బంగారంపై సుంకాలను పెంచింది.
అలాగే పెట్రోల్ ధరలను తాజాగా పెంచింది. ఇక, ఇప్పుడు విదేశీ ప్రయాణాల వంతు వచ్చింది. అనవసర విదేశీ విహారయాత్రలు, పర్యటనలను తగ్గించే దిశగా ఫారిన్ ట్రావెల్ని మరింత ఖరీదైన వ్యవహారంగా మార్చబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలపై ట్యాక్స్లు/సెస్సులు/సర్చార్జీలు వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికైతే ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రేపో మాపో వడ్డించడమైతే ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలికంగా ఏడాది పాటు వర్తించేలా ట్యాక్స్ విధించవచ్చని భావిస్తున్నారు. విదేశీ పర్యటనలపై విధించే ట్యాక్సులు, సెస్సులు, సర్చార్జీల ద్వారా వచ్చే నిధులు మొత్తం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ఖాతాలోకి కాకుండా నేరుగా కేంద్రం ఖాతాలోకే వెళ్లొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలా వచ్చిన నిధులతో, క్రూడాయిల్ దిగుమతుల వ్యయాల భారాన్ని కాస్త భర్తీ చేసుకోవచ్చనే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నాయి. దీనిపై అత్యున్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
232 బిలియన్ డాలర్ల టూరిజం పరిశ్రమ..
దాదాపు 231.6 బిలియన్ డాలర్ల విలువతో భారత్ టూరిజం రంగం ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో నాలుగో స్థానానికి ఎగబాకుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రంగం దేశీయంగా 10 శాతం మేర ఉద్యోగాలను కల్పిస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, వీసాల లభ్యత సులభతరం కావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, డెస్టినేషన్ వెడ్డింగ్ల్లాంటి అంశాలతో విదేశీ ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫారిన్ ట్రావెల్ సెగ్మెంట్ గణనీయంగా విస్తరిస్తోంది.
2024లో విదేశీ పర్యటనల వ్యయాలు సుమారు 18.82 బిలియన్ డాలర్లుగా ఉండగా 2034 నాటికి 55.39 బిలియన్ డాలర్లకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. 2025లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 6 శాతం పెరిగి 3.27 కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ ప్రయాణాల విషయంలో 2019లో 10వ స్థానంలో ఉన్న భారత్ 2027 నాటికి అయిదో స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ ప్రస్తుతం డాలర్ నిల్వలను కాపాడుకోవాల్సి వస్తుండటంతో అనవసర విదేశీ పర్యటనలకు కళ్లెం వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
దేశీ ట్రావెల్కి దన్ను..
విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపుతో దేశీయంగా పర్యాటకానికి ఊతం లభించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం ద్వారా విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించగలిగితే ఆ విధంగా ఫారెక్స్ని సమకూర్చుకునేందుకు వీలవుతుందని ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి.
విదేశీ ఫ్లైట్స్ రేట్లకు రెక్కలు..
ఇంధన వ్యయాలు, గగనతలాలపై ఆంక్షలు, నిర్వహణపరమైన అనిశి్చతులతో ఇప్పటికే పలు అంతర్జాతీయ రూట్లలో ఫ్లయిట్ చార్జీల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎయిరిండియాలాంటి దేశీ విమానయాన సంస్థలు భారాన్ని భరించలేక కొన్ని రూట్లలో ఫ్లయిట్స్ని రద్దు కూడా చేస్తున్నాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో వారానికి దాదాపు వంద ఇంటర్నేషనల ఫ్లయిట్ సరీ్వసులను తగ్గించుకుంటున్నట్లు ఎయిరిండియా తెలిపింది. అలాగే ఏడు రూట్లలో సరీ్వసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో మొత్తం మీద విదేశీ రూట్లలో సీట్లు సుమారు 27 శాతం తగ్గుతాయని పేర్కొంది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగినంత వరకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్పై ప్రభావం తప్పదని ట్రావెల్ బుకింగ్ అగ్రిగేటర్ సంస్థ ఇక్సిగో వర్గాలు పేర్కొన్నాయి.
(సాక్షి బిజినెస్ డెస్క్)


