జూనియర్లకు అవకాశం
కల్పించాలన్న జస్టిస్ విక్రమ్ నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనం (వెకేషన్ బెంచ్) ముందు వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను అనుమతించేది లేదని న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. సెలవుల్లో కేవలం యువ న్యాయవాదులు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్)లకు మాత్రమే తన కోర్టులో అవకాశం కల్పిస్తానని తేల్చి చెప్పారు. తమ కేసులను ప్రస్తావించేందుకు ప్రయతి్నంచిన పలువురు సీనియర్లను న్యాయమూర్తి వారించారు.
తనకు అధికారికంగా సీనియర్ హోదా లేనందున వాదించేందుకు అనుమతివ్వాలని న్యాయవాది మాథ్యూస్ నెడుంపర కోరగా నిరాకరించారు. ఈ నిర్ణయం తమకు ముందుగా తెలియదని, కనీసం రేపటి నుంచైనా అమలు చేయాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కోరారు. గత వారం నోటీసులు జారీ చేసిన కేసుల్లో తాము ఇదివరకే హాజరైనందున, ఈ రోజైనా వాదించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఇతర ధర్మాసనాలు సీనియర్లను అనుమతిస్తున్నాయని గుర్తుచేశారు. మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సైతం అవకాశం ఇవ్వాలని కోరారు. సీనియర్ల విజ్ఞప్తులను జస్టిస్ విక్రమ్నాథ్ తోసిపుచ్చారు. యువ న్యాయవాదులు, ఏవోఆర్లను ప్రోత్సహించి వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జూన్ ఒకటి నుంచి జూలై 12వ తేదీ వరకు సెలవుల కాలంలో పని దినాల్లో తన కోర్టులో సీనియర్లకు అనుమతి లేదన్నారు. ఈ నిబంధన ఎవరికీ తెలియదన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. గత నాలుగేళ్లుగా ప్రతి వెకేషన్లోనూ తన బెంచ్ ఇదే విధానాన్ని పాటిస్తోందని, ఈ విషయం అందరికీ తెలుసునని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు.
నెడుంపర అభ్యర్థనపై స్పందిస్తూ.. తన దృష్టిలో ఆయన సీనియర్ న్యాయవాదేనని పేర్కొన్నారు. గత వారం హాజరైన కేసుల్లో వాదించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనలను సైతం ధర్మాసనం అంగీకరించలేదు. తన వైఖరిని మార్చుకునేది లేదని జస్టిస్ విక్రమ్నాథ్ తేల్చిచెప్పారు. కోర్టు హాలు నుంచి సీనియర్ న్యాయవాదులను పంపించి వేయాలని కోర్టు మాస్టర్ను ఆదేశించారు. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేను సైతం అనుమతించని న్యాయమూర్తి.. ఆయన స్థానంలో సహాయక న్యాయవాది వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


