పోచారం: ప్రపంచంలోనే అత్యున్నత విద్యావిధానం గల ఫిన్లాండ్ దేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బృందం ఈనెల 18 నుంచి పర్యటించనున్నది. ఈ బృందంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన సెకండ్ గ్రేడ్ టీచర్ విశ్వశాంతికి స్థానం లభించింది. 18 ఏళ్ల బోధనానుభవం గల విశ్వశాంతి (vishwashanti) జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లోనూ రీసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పలు మాడ్యూళ్ల రూపకల్పన, పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యకు చెందిన వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ రచనల్లోనూ ఆమె సేవలు అందించారు.
సీఎం రేవంత్రెడ్డి 4 బృందాలను ఏర్పాటు చేసి ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, వియత్నాం దేశాలకు ఒక్కో బృందాన్ని పంపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి 40 మంది నిపుణుల బృందం ఈనెల 18న ఫిన్లాండ్ దేశ పర్యటనకు వెళ్లనున్నది.
20 నుంచి 24 వరకు అక్కడి పాఠశాలలు, టీచర్ ట్రైనింగ్ సెంటర్లను సందర్శించి, పాఠ్యాంశాలు, వారు అవలంభించే బోధనా పద్ధతులు, విద్యార్థుల స్థాయిలను పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తుంది. విశ్వశాంతి ఎంపికవ్వడంపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, స్కూల్ హెచ్ఎం సాంబమూర్తి, టీచర్లు ప్రశంసించారు.


