
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ తారలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ పార్టీకి తాము హాజరు కాలేదని హేమ, శ్రీకాంత్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యాంకర్ శ్యామలపై కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.
దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్ శ్యామల గట్టిగానే స్పందించింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇప్పటికే వారిపై పరువునష్టం దావా వేసినట్లు శ్యామల వెల్లడించింది. కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది.
అయితే యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది.