
దాదాపు ఆరేడేళ్ల క్రితం మీటూ(#Me too) ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా నడిచింది. పలువురు హీరోయిన్లు, నటీమణలు.. తమకెదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ హీరోయిన్ తనుశ్రీ దత్తా- నానా పాటేకర్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది.
ఏం జరిగింది?
హీరోయిన్ గా తనుశ్రీ దత్తాకు కాస్త గుర్తింపు ఉంది. తెలుగులోనూ బాలకృష్ణ 'వీరభద్ర' చిత్రంలో నటించింది. అసలు విషయానికొస్తే 2018లో ఈమె ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న టైంలో నానా పాటేకర్ సహా మరో ముగ్గురు తనని వేధించారని తనుశ్రీ ఆరోపించింది.
(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)
తనుశ్రీ బహిరంగంగానే ఈ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అప్పుడు కేసు కూడా నమోదు చేశారు. విచారణలో మాత్రం ఇలాంటిదేం జరగలేదని తేల్చారు. నటి ఆరోపణలన్నీ అవాస్తవాలని కోర్టుకి నివేదిక సమర్పించారు. దీనిపై 2019లో తనుశ్రీ దత్తా మరోసారి పిటిషన్ దాఖలు చేసింది.
చాలా వాయిదాల తర్వాత ఇప్పుడు కేసుపై ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో నానా పాటేకర్ కి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నానా పాటేకర్.. మహేశ్ బాబు-రాజమౌళి మూవీలో నటిస్తున్నారని సమాచారం.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు))