మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంవ్యాప్తంగా విడుదల కానుంది. ఫ్రాన్స్లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’కు దర్శకులు రాజమౌళి, ఇషాన్ శుక్లా హాజరయ్యారు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న యానిమేషన్ సినిమా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ఎంపికైంది. ఈ సందర్భంగా రాజమౌళి, ఇషాన్ ఫ్రాన్స్ వెళ్లారు. ఈ వేడుకలోనే ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ‘వారణాసి టు ది వరల్డ్’ వీడియోను ప్రదర్శించగా, వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడి, ‘వారణాసి’ సినిమా గురించిన కీలక విశేషాలను వెల్లడించారు రాజమౌళి. ‘‘వారణాసి’కి సంబంధించిన ప్రధాన సన్నివేశాలు, భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలు మొత్తం పూర్తయ్యాయి. ప్రస్తుతం కథను అనుసంధానించే చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సెప్టెంబరుకల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని అనుకుంటున్నాం’’ అన్నారు.
‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ– ‘‘యానిమేషన్ రంగానికి కూడా ‘బాహుబలి’ సినిమాను విస్తరించే ఆలోచన ఉంది. భారత పురణాల్లోని 14 లోకాలకు ‘బాహుబలి’ని విస్తరించే ఆలోచనతో ఇషాన్ నా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న క్షణం ఇదే అనిపించింది’’ అని చెప్పారు.
రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా దర్శకత్వంలో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రభాస్, శివగామి పాత్రకు రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. దేవ కట్టా, మదన్ కార్కే డైలాగ్స్ అందిస్తుండగా, ఇషాన్ శుక్లా, సౌమ్యా శర్మ కథను అందిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.


