బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంది. తన ఫేస్ కట్ సరిగా లేదని, దవడకు సర్జరీ చేయించుకోవాలని.. ఇలా చాలామంది నానామాటలు అన్నారు. కొన్నిసార్లు ఈ విమర్శల వల్ల బాధపడ్డప్పటికీ వీలైనన్ని సార్లు ఈ కామెంట్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడానికే ప్రయత్నిస్తున్నానంటోంది షనయా.
పాజిటివ్గా తీసుకుంటా..
జూమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షనయా కపూర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాలారకాల కామెంట్లు వస్తుంటాయి. నా పని గురించి కావొచ్చు, లేదంటే నా డ్యాన్స్, యాక్టింగ్ ఎలా ఉందని చెప్తుంటారు. అయితే కొన్నిసార్లు కాస్త కఠినంగా చెప్పినప్పటికీ దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను. వాళ్ల అభిప్రాయాలు వింటాను. వాళ్ల విమర్శలు కొంత బాధపెట్టవచ్చేమో కానీ చాలా విషయాలు తెలియజేస్తాయి.
వాటిని లెక్కచేయను
వాళ్లు ఏది కోరుకుంటున్నారో తెలుసుకునే కదా ముందడుగు వేయాలి. వాటిని పట్టించుకోకపోతే ఎలా? కానీ, నా లుక్స్ గురించి, ఫేస్ గురించి, శరీర సౌష్ఠవం గురించి కామెంట్స్ చేస్తే మాత్రం లెక్కచేయను. వాటిని లైట్ తీసుకుంటాను. ఈ ట్రోలింగ్ వల్ల కొన్నిసార్లు బాధనిపిస్తుంది. అప్పుడు అమ్మ(నటి మహీప్ కపూర్)తో నా బాధ చెప్పుకుంటాను. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.
సినిమా
షనయా.. 'ఆంఖోన్ కీ గుస్తాఖియన్' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ప్రస్తుతం షనయా 'తు యా మే' మూవీ చేస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.


