ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించింది హిందీ బుల్లితెర నటి సుజానే బెర్నెర్ట్. లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటోంది. సుజానె భర్త, నటుడు అఖిల్ మిశ్రా 2023లో మరణించాడు. ఆ తర్వాత బాధలో కూరుకుపోయిన ఆమెకు అర్జున్ హర్దాస్ అనే వ్యక్తి బాసటగా నిలిచాడు.
రెండేళ్ల ప్రేమ
ఢిల్లీకి చెందిన ఇతడి సాన్నిహిత్యంలో త్వరగానే బాధ నుంచి బయటపడింది సుజానె. వీరిద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. అలా రెండేళ్లుగా కలిసుంటున్నారు. ఈ విషయం గురించి సుజానె మాట్లాడుతూ.. ప్రేమకు వయసుతో పనేంటి? ఈ ఫలానా వయసువరకే ప్రేమలో పడొచ్చు అని ఎక్కడా రాసిలేదే.. స్వచ్ఛమైన ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రేమికుల రోజు కోసం వెయిటింగ్
ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే రోజు కోసం ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు. నాకు ఎప్పుడెప్పుడు కానుకలు ఇవ్వాలా? అని తాపత్రయపడుతున్నాడు. అలా అని ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకోవడం లేదు. కేవలం మా ఆనందాన్ని పంచుకుంటామంతే! అని చెప్పుకొచ్చింది. సుజానె (Suzanne Bernert)- అఖిల్ మిశ్రా 2009లో పెళ్లి చేసుకున్నారు. 2023లో అఖిల్ మిశ్రా కన్నుమూశాడు. ఆ తర్వాత పరిచయమైన అర్జున్తో సుజానె ప్రేమలో పడగా అప్పటినుంచి వీరిద్దరూ కలిసుంటున్నారు.
సీరియల్స్, సినిమా
సుజానె.. ప్యార్ కా పెహ్లా నామ్: రాధా మోహన్, యే రిష్తా క్యా కెహ్లాతా హై, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. వెండితెరపై నో ప్రాబ్లమ్, లవ్ రెసిపీ, ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తీర్పు వంటి పలు సినిమాలు చేసింది. చివరగా యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రను పోషించింది.


