యాక్షన్ కింగ్, నటుడు, దర్శకుడు అర్జున్ సర్జాకు తెలుగులో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. మా పల్లెలో గోపాలుడు మూవీతో తెలుగు వారికి పరిచయం అయిన అర్జున్.. తన కెరీర్లో సుమారు 180కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, తన 46 ఏళ్ల సినీ జీవితంలో చాలామంది తనను మోసం చేశారని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
తన పిల్లల కోసం పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని అర్జున్ ఇలా చెప్పారు. 'నేను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నన్ను చాలామంది మోసం చేశారు. ఇప్పుడు వారి పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండే వాళ్లే.. నాకు ఏమీ తెలియని వయసులో మోసం చేశారు. చిన్న వయసులోనే డబ్బు వస్తోంది.. కానీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అప్పుడు తెలియలేదు. నా వాళ్లే నన్ను మిస్- యూజ్ చేశారు.
ఆరోజుల్లో నేను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు భారీగా ఆస్తులు ఉండేవి. పెట్టుబడుల ఎక్కడ పెట్టాలో శోభన్ బాబు గారు చాలాసార్లు నాకు చెప్పారు. నాతో ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు. పెట్టుబడులు పెట్టాలని డబ్బు ఎక్కడ వృథాగా పోతుందో చూసుకోమని నాతో చెప్పేవారు. కానీ, ఆ సమయంలో నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో ఒక సినిమాలో కలిసి పనిచేశాను. కేవలం ఒక్క మూవీతోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మా అనుబంధం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట వినిఉంటే బాగుండేది' అని ఇప్పుడు అనిపిస్తుందని అర్జున్ గుర్తు చేసుకున్నారు.

తెలుగులో కూతురు ఎంట్రీ
కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని మధుగిరిలో జన్మించిన అర్జున్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనదైన యాక్షన్ స్టైల్తో ప్రత్యేక గుర్తింపు పొందారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘సీతా పయనం’ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తోంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ‘సేవగన్’తో 1992లోనే డైరెక్టర్గా మారిన ఆర్జున్.. తెలుగులో ‘సీతాపయనం’తో తొలిసారి దర్శకత్వం వహించారు. టాలీవుడ్లోనే తన కూతురు రాణించాలని ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.


