తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదల కానుంది. ఈమేరకు కోలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పేర్కొంది.
జన నాయగన్ సెన్సార్ విషయంలో నెలల తరబడి కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే దిశగా చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కోలీవుడ్లో వచ్చిన కథనాల ప్రకారం. సెన్సార్ బోర్డు అభ్యంతరం సూచించిన సుమారు 20 నిమిషాల నిడివి గల సీన్స్ను తొలగించడంతో పాటు కొన్ని డైలాగ్స్ను కూడా మ్యూట్ చేయడానికి నిర్మాతలు అంగీకరించారని సమాచారం. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్కి కొత్త వర్షెన్ సమర్పించి కోర్టు కేసులని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్కేలు నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, రేవతి తదితరులు నటించారు.


