టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇతడి అత్తమ్మ పద్మావతి చనిపోయారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈ డైరెక్టర్.. చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇన్నాళ్లు అమ్మని తనలో చూసుకున్నానని, ఒకే తేదీన అప్పుడు అమ్మ ఇప్పుడు అత్తమ్మ చనిపోయారని బాధపడుతూ ఈ సంగతి పంచుకున్నాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటోలు కూడా పంచుకున్నాడు.
'ఇన్నాళ్లు మా అమ్మ ని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ 'పద్మావతి' శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు.. 2003 ఫిబ్రవరి 7వ తేదీన పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్.. తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని కన్నడలో రీమేక్ చేసి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మెహర్ రమేశ్.. 'కంత్రి' మూవీతో టాలీవుడ్లో ప్రయాణం మొదలుపెట్టాడు. తర్వాత బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ అంటూ పలు చిత్రాలు చేసినప్పటికీ.. ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. గత కొన్నాళ్లుగా అయితే బయట కూడా మెహర్ రమేశ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు విషాద వార్తని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు.


