బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేడు ఆయన దేశంలోనే అత్యంత పాపులర్ హీరోల్లో ఒకరు. అయితే ఈ స్థాయికి చేరుకోకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తన తల్లితో కలిసి అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు. అప్పుడే జరిగిన ఓ ఆసక్తికర ఘటనను షారుఖ్ ఖాన్ గతంలో స్వయంగా వెల్లడించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
రూ.500 కోట్లు సంపాదిస్తావని..
2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడిన షారుఖ్.. తన తల్లితో కలిసి అజ్మీర్ షరీఫ్కు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తన తల్లి దర్గాకు వెళ్లారట. చాదర్ సమర్పించేందుకు వెళ్తున్న సమయంలో తన తల్లి రూ.5 వేల నగదును షారుఖ్కు ఇచ్చారట. అయితే కొంతసేపటి తర్వాత ఆ డబ్బు కనిపించకుండా పోయిందట. షారుఖ్ దానిని వెతుకుతుండగా అక్కడే ఉన్న ఓ ఫకీర్ ఆయనను పిలిచి ఏదైనా పోగొట్టుకున్నావా? అని అడిగారట. షారుఖ్ అవునని చెప్పడంతో.. ఎంత డబ్బు పోయిందని కూడా ఆ ఫకీర్ చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత ఆ ఫకీర్ చెప్పిన మాటలు షారుఖ్ జీవితంలో నిజమైనట్టే అనిపించాయట. ‘నువ్వు ఇక్కడికి వచ్చావు. ఖాళీ చేతులతో వెళ్లవు. రూ.5 వేలు పోగొట్టుకున్నావు.. కానీ రూ.500 కోట్లు సంపాదిస్తావు’ అని ఫకీర్ చెప్పారట. (ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు సర్ప్రైజ్)
షారుఖ్ పెద్దగా నమ్మలేదట..
అప్పట్లో ఈ మాటలను షారుఖ్ పెద్దగా నమ్మలేదట. కానీ ఆ ఘటన మాత్రం ఆయన మనసులో నిలిచిపోయింది. తర్వాత బాలీవుడ్లో అగ్ర హీరోగా ఎదిగి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. భారీ స్థాయిలో సంపద కూడా కూడబెట్టారు. అయితే ఈ ఘటనను కేవలం డబ్బుతో ముడిపెట్టడం సరికాదని షారుఖ్ తెలిపారు. (ఇదీ చదవండి: షాలినీపై నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు.. బిగ్బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్)
షారుఖ్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్..
షారుఖ్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్ 1991లో కన్నుమూశారు. ఆ తర్వాత ఏడాదికే ‘దీవానా’ సినిమాతో షారుఖ్ బాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టారు. తన తల్లి తన విజయాన్ని చూడాలని ఎంతో కోరుకున్నానని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలోనే తొలిసారి ప్రార్థించానని షారుఖ్ గతంలో గుర్తుచేసుకున్నారు. ఆమె చివరి క్షణాల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.
అజ్మీర్ షరీఫ్ దర్గా సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీకి అంకితం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రం. అన్ని మతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. షారుఖ్ కూడా తన జీవితంలో పలుమార్లు ఈ దర్గాను సందర్శించారు.


