సుశాంత్‌ డ్రగ్‌ తీసుకుంటాడని ఇంట్లో ముందే తెలుసు, వాళ్ల అక్క కూడా..

Rhea Chakraborty Latest Comments On Sushant Singh Rajput Case - Sakshi

బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి ఏడాది కావొస్తున్న ఇప్పటికి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. అతడి మరణంతో బీ-టౌన్‌ డ్రగ్‌ వ్యవహరం బట్టబయలైంది. అలా సుశాంత్ సింగ్ కేసులో ఇప్పుడు ఎన్‌సీబీ, సీఐడీ ఇలా అనేక విభాగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దీంతో ఏడాది నుంచి ఈ కేసు ఎన్నో మలుపు తిరుగుతూ వస్తోంది. ఇక ఎన్‌సీబీ కేసు విచారణ, దర్యాప్తు అంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాగా ఈ కేసులో అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్‌కు అత్యధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చిందని, ఆమెకు డ్రగ్‌ పెడ్లర్లతో సంబంధం ఉందని నిర్ధారణ కావడంతో ప్రధాన నిందితురాలిగా ఆమెపై ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది.

అనంతరం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించింది. రియాతో పాటు ఆమె సోదరుడు, మరికొంతమందికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం ఈ ఇద్దరికి బెయిల్ మంజూరైంది. అలా బయటకు వచ్చిన ఆమె కొద్ది రోజులు సైలెంట్‌గానే ఉన్నా.. తాజాగా ఎన్‌సీబీ విచారణలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుశాంత్ సోదరి ప్రియాంక, ఆమె భర్త ఇద్దరూ కూడా డ్రగ్స్ వాడేవారని, సుశాంత్ డ్రగ్స్ వాడతారని ఇంట్లో వాళ్లకు తెలుసని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక సుశాంత్‌ చనిపోయే ముందు అంటే ఓ నాలుగు రోజుల ముందు అంటే జూన్ 8వ తేదీన సుశాంత్‌ సోదరి ప్రియాంక డ్రగ్స్ కావాలని వాట్సప్ మెసేజ్‌ చేసిందని, తనకు 10 గ్రాముల లిబ్రియం, నెక్సిటో కావాలంటూ చాట్‌ చేసినట్లు తెలిపింది.

అంతేగాక న‌టి సారా అలీ ఖాన్ కూడా ఇందులో భాగ‌మైన‌ట్లు వెల్ల‌డించింది. సైఫ్ అలీ ఖాన్‌, అమృతా సింగ్‌ల కూతురైన సారా త‌న‌కు ప‌రిచ‌యం ఉందని, ఆమెతో కలిసి గంజాయి పిల్చానని, పలుమార్లు, సారా త‌న‌కు గంజాయితో పాటు వోడ్కాను కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్లు రియా త‌న వాంగ్మూలంలో వెల్ల‌డించింది. మరో వారంలో సుశాంత్‌ తొలి వర్థంతి వస్తున్న నేపథ్యంలో రియా తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా గతేడాది జూన్‌ 14 సుశాంత్‌ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top