
నవ్వడం ఒక వరం. నవ్వు రావాలంటే కూడా అదృష్టం ఉండాలి. మన జీవితంలో ప్రతిరోజు నవ్వుతూ బతకాలంటే మనకు రాసి పెట్టుండాలి. అదేంటి నవ్వడానికి ఓక జోక్ వింటే చాలుగా.. ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఎందుకు అనుకుంటున్నారా? మీరు చెప్పింది కూడా కరెక్ట్ కానీ.. నవ్వడం అందరికీ సరదాగా ఉంటుంది. కానీ మనం ఒకరిని నవ్వించాలంటే మాత్రం మన వద్ద ఏదో ప్రత్యేకత ఉండాలి. అందరూ జోక్స్ చెబుతారు.. కానీ కొందరి చెబితేనే నవ్వు వస్తుంది. అలా మనం తెలుగు సినిమాల్లో ప్రేక్షకులను కడుప్పుబ్బా నవ్వించిన కమెడియన్స్ ఎంతమంది అలా వెళ్లమీదే లెక్క పెట్టేస్తారు. ఎందుకంటే అలా నవ్వించడం కొందరికీ మాత్రమే సాధ్యపడుతుంది. అలా మనల్ని వెండితెరపై దశాబ్దాల పాటు నవ్వించి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క బ్రహ్మనందం పేరే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బాబు మోహన్, ఎంఎస్ నారాయణ అలీ, వేణుమాధవ్, సునీల్ లాంటి కమెడియన్స్ కూడా మన టాలీవుడ్లో తమ హావభావాలతో మనల్ని నవ్వించారు. అంతకుముందు అల్లూరి రామలింగయ్య, పద్మనాభం, రాజా బాబు లాంటి ఎందరో మహానుభావులు సైతం వెండితెరపై నవ్వులు పూయించారు. ఆదివారం (మే 4వ తేదీ) ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తన నటనతో, హావభావాలతో కడుపుబ్బా నవ్వించిన వారిని, నవ్విస్తోన్న వారిని ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం.
కడుపుబ్బా నవ్వించే కమెడియన్ పద్మనాభం..
అప్పట్లో ప్రముఖ హాస్యనటుడు బసవరాజు పద్మనాభం బహుముఖ ప్రజ్ఞాశాలి. సింహాద్రిపురంలో జన్మించిన ఆయన వెండి తెరపై హాస్యాన్ని పండించి తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో దేవత చిత్రాన్ని నిర్మించడంతోపాటు పొట్టి ప్లీడర్, శ్రీరామకథ సినిమాలకు దర్శకత్వం వహించారు.
శాస్త్రిగా మెప్పించిన అల్లు రామలింగయ్య..
తెలుగు సినిమా చరిత్రలో కమెడియన్ల విషయంలో వేళ్ల మీద లెక్క పెడితే అందులో మొదట వినిపించే పేరు అల్లు రామలింగయ్య. హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు ఆయనే. 1953లో తొలిచిత్రం పుట్టిల్లులో పోషించిన శాస్త్రులు, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడులో హాస్టలు వార్డెను పాత్రలతో ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు. ఆ తర్వాత భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 2004 నాటికి దాదాపు 1,000కి పైగా చిత్రాల్లో విలక్షణ పాత్రలతో సినీ ప్రియులను అలరించారు. పుట్టిల్లు, ‘మాయాబజార్ సినిమ్లాల్లోనీ శాస్త్రులు పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఆ తర్వాత అనేక చిత్రాల్లో శాస్త్రి పాత్ర ఆయన్నే వరిచింది.
బక్కపలచని రాజా బాబు..
అప్పట్లో తన హవా భావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యనటుల్లో రాజా బాబు ఒకరు. తనదైన నటనతో ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవారని చెబుతుంటారు. తెలుగు సినీ చరిత్రలో హాస్యనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచే ఉంటుంది.
హాస్య బ్రహ్మ బ్రహ్మనందం..
టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. కొన్ని వందల చిత్రాల్లో తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి హాస్యనటుడిగా నిలిచారు. కేవలం తన హావభావాలతో నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు దక్కించుకున్నారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. చివరిసారిగా తన కుమారుడితో కలిసి బ్రహ్మ ఆనందం మూవీలో కనిపించారు. ఆయనతో పాటు టాలీవుడ్లో అలీ, సునీల్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, బాబు మోహన్, వేణు మాధవ్ సినీ ప్రియులను తమ నటన, కామెడీతో నవ్వులు పండించారు.